కులశేఖర ఆళ్వార్

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

kulasekarazhwar

తిరునక్షత్రము: మాఘ మాసము (మాశి), పునర్వసు నక్షత్రం
అవతార స్తలము: తిరువంజిక్కళమ్
ఆచార్యులు: విష్వక్సేనులు
శ్రీ సూక్తులు: ముకుంద మాల, పెరుమాళ్ తిరుమొళి
పరమపదము చేరిన ప్రదేశము: మన్నార్ కోయిల్ (తిరునన్వెల్లి దగ్గర)

కులశేఖరాళ్వార్లు క్షత్రియ కులములో జన్మించినప్పటికి భగవానుని యెడల, భాగవతుల యెడల చాలా విధేయుడై ఉండెడివారు. వీరికి రాముడి పట్ల ఉన్న అనన్య భక్తి వలన ఈ ఆళ్వార్ ‘కులశేఖర పెరుమాళ్’ (పెరుమాళ్ అనేది భగవంతుని సంబోధించు పదం) గా ప్రసిద్దులైరి. తమ ‘పెరుమాళ్ తిరుమొళి’ ప్రబంధం మొదటి పదిగములో (ఇరుళిరియ చ్చుడర్ మణిగళ్) పెరియ పెరుమాళ్ళకు మంగళాశాసనము చేసిన వెంటనే, తమ రెండవ పదిగములో (తేట్టరున్ తిఱల్ తేనినై) శ్రీవైష్ణవుల వైభవమును తెలిపిరి. శ్రీవైష్ణవుల సంబంధము వలన వీరు ప్రసిద్ధి పొందిరి. దీనిని వీరి చరిత్రలో మును ముందు తెలుసుకుందాం.

జీవాత్మ అసలు స్వరూపము శేషత్వమే అని ఆళ్వార్ నిర్ణయించుకొని తామే స్వయంగా తమ ‘పెరుమాళ్ తిరుమొళి’ చివరిలో (10.7) ఈ విధముగా తెలిపిరి “తిల్లైనగర్ త్తిరుచిత్తిరకూడన్ తన్నుళ్ అరశ అమర్ న్దాన్ అడిశూడుమ్ అరశై అల్లాల్ అరశాగ ఎణ్ణేన్ మత్తరశు తానే”.  దీనర్థము: తిరుచిత్రకూట రాజు (గోవింద రాజ పెరుమాళ్) శ్రీపాద పద్మములను తప్ప మరేతర దానిని ఉపాయముగా నేను భావించను. దేవతాంతర / విషయాంతర సంబంధము జీవాత్మకు ఉండకూడని ఈ వాక్యం ద్వారా స్పష్టముగా నిర్ధారించెను.

“అచిత్ వత్ పారతంత్ర్యం” వలె జీవాత్మ స్వరూపం ఉండాలని తిరువేంకట పదిగము  4.9 లో తీర్మానించెను.

దాని వివరణ:

శెడియాయ వల్వినైగళ్ తీర్కుమ్ తిరుమాలే
ణెడియానే వేఙ్గడవా! నిన్ కోయిలిన్ వాశల్
అడియారుమ్ వానవరుమ్ అరమ్బైయరుమ్ కిడన్దు ఇయఙ్గుమ్
పడియాయ్   క్కిడన్దు ఉన్ పవళ వాయ్ కాణ్బేనే॥

“ఓ వేంకటేశా! అనాది కాలముగా ఆర్జించిన పాపాలను ఛేదించే వాడివై, తిరుమలకు వేంచేసే నీ భక్తులు, దేవతలు కలసి సంచరించే నీ దివ్య సన్నిధి వాకిటిలో వారి పాదాలు తగిలే గడపగా పడి ఉండి పగడము వంటి పరమ భోగ్యమైన నీ అధరోష్ఠాన్ని ఎల్లప్పుడూ సేవించే భాగ్యాన్ని కలవాడను కావాలి.” అని కోరుకొనిరి.

పెరియ వాచ్చాన్ పిళ్ళై జీవాత్మకు ఉండు రెండు సంబంధములను గురించి ఈ విధముగా వివరించిరి.

  • పడియై కిడందు –  చందనము, పుష్పములు తమ కోసం కాకుండా, వాటిని ధరించే వారి ఆనందము కోసం ఉన్నట్లు, అచిత్ (అచేతనములు) వలె జీవాత్మ ఎల్లప్పుడూ భగవానుని ఎడల పూర్తి నియంత్రణను కలిగి ఉండవలెను.
  • ఉన్ పవళవాయ్ కాణ్బేనే –  చిత్ (చేతనములు) ఎల్లప్పుడూ భగవానుడు మన సేవను స్వీకరించి ఆ సేవచే ఆనందమును పొందుచున్నాడని భావించవలెను. ఒక వేళ ఆ సత్యమును గ్రహించని యెడల మనకు అచిత్ నకు ఏవిధమైన తేడా ఉండదు.

ఈ సూత్రమును “అచిత్ వత్ పారతంత్ర్యం” అని పిలుచుదురు. దీనర్థము జీవాత్మ పూర్తిగా భగవానునిచే నియంత్రింపబడును. ఇది మన శ్రీవైష్ణవ సిద్దాంతములో అతి ముఖ్యమైన సూత్రము.

ఇది వరకే మామునులు తమ ‘అర్చావతార అనుభవము’ అనే సంచికలో కులశేఖరాళ్వార్ల  గొప్పతనమును వివరించారు. దానిని ఈ సైట్ లో చూడగలరు –

http://ponnadi.blogspot.in/2012/10/archavathara-anubhavam-kulasekara.html.

నాయనార్లు తమ ‘ఆచార్య హృదయం’ గ్రంథములో భాగవతుల జన్మని బట్టి వారి యందు భేదమును చూపరాదని వివరించి, చివరిలో నమ్మాళ్వార్లు, ఇతర మహానుభావుల గొప్పతనమును చెప్పిరి. మానవ జన్మ దుర్లభత్వమును వివరిస్తూ దానిని భగవత్ కైంకర్యము చేయుటకు అనుకూలముగా మలచు కోవాలని చెప్పిరి. ఎందరో మహాపురుషులు కైంకర్యము చేయుటకు అనుకూలమైన నిమ్నజాతి జన్మను ఆశించారని ఇక్కడ దృష్టాంతములతో సహా నాయనార్లు ఉదాహరించెను.  87వ చూర్ణికలోని సారమును, అది ఏవిధముగా కులశేఖరాళ్వార్లకు అన్వయమవునో చూద్దాము.

“అన్ణైయ ఊర పునైయ అడియుమ్ పొడియుమ్ పడప్ పర్వత భవణన్ఙ్గళిలే ఏతేనుమాగ జణిక్కప్ పెఱుగిఱ తిర్యక్ స్తావర జణ్మన్ఙ్గళై పెరుమక్కళుమ్ పెరియోరుమ్ పరిగ్రహిత్తుప్ ప్రార్తిప్పర్గళ్”

నిత్యసూరులైన అనంత గరుడాదులు పానుపుగా (ఆదిశేషుడు), ఒక పక్షిలా (గరుడ) జన్మించాలని ఆశించారు. భగవానునికి మహా ప్రీతి అయిన తిరుత్తుళాయ్ (తులసి)ని తన దివ్య తిరుమేని అంతయూ (తన శిరస్సుపై, భుజములపై, వక్షస్థలముపై) అలంకరించు కొందురని నమ్మాళ్వార్లు వివరించిరి. కృష్ణుడు, గోపికల పాద పద్మాల స్పర్శ కలగాలని బృందావనములో మట్టిగానైన ఉండవలెనని పరాశర వ్యాస శుక మహర్షులు కోరు కొనిరి. కులశేఖరాళ్వార్లు  కూడా తిరుమల కొండపైన ఒక అచిత్ వస్తువుగా పడి ఉండాలని కోరుకొనిరి. ఆళవందార్లు కూడా ఒక శ్రీవైష్ణవుడి గృహములో పురుగుగానైనా జన్మించవలెనని కోరు కొనిరి. క్రింద చూర్ణికలో కులశేఖరాళ్వార్ల కోరికని మామునులు ఏవిధముగా వ్యాఖ్యానించిరో  చూద్దాము.

‘పెరుమాళ్ తిరుమొళి’ 4 వ పదిగములో, ఆళ్వార్ తిరుమలతో ఏవిధంగానైనా సంబంధము కలిగి ఉండవలెనని కోరుకొనిరి – నిత్యము తిరుమలతో ఉండాలని కోరుకొనేవారు.

sri-srinivasar

వారికి గల కోరికలు:

  • కొండపై గల కొలను దగ్గర ఒక పక్షిలా –
  • కొలనులో ఒక చేపలా – ఎందుకంటే –  ఒకవేళ  పక్షినైతే తిరువేంగడం నుండి దూరంగా ఎగిరి పోవచ్చునేమోనని.
  • భగవానుని కైంకర్యపరుల చేతిలో బంగారు పాత్రలా –  ఎందుకనగా చేపనైతే ఈదుతూ వెళ్ళి పోవచ్చునేమోనని.
  • చెట్టుపై ఒక పువ్వులా – ఎందుకంటే – బంగారము అనగానే అహంభావము కలిగి ఙ్ఞానము దారితప్పు నేమోన్అని.
  • ఒక పనికిరాని చెట్టులా – ఎందుకంటే –  ఒకసారి పువ్వుని వాడి, బయట పడివేయుదురు కదా.
  • ఒక నదిలా – ఎందుకంటే – పనికిరాని చెట్టుని ఏ రోజైనా తీసివేయుదురు కదా.
  • సన్నిధికి వెళ్ళు దారిలో మెట్లవలె – ఎందుకంటే – నది ఒక రోజు ఎండి పోవచ్చు కదా.
  • చివరకు గర్భగుడికి  ఎదురుగా గల మెట్టులా (దీనినే కులశేఖర పడి అని వ్యవహరించుదురు) ఎందుకంటే – మెట్లవలె ఉండడము వలన కొన్ని రోజుల తర్వాత  దారి మార్చవచ్చు.
  • ఏ విధంగానైన తిరుమలలో నిత్య నివాసం చేయవలెనని కోరుకొనిరి. పెరియ వాచ్చాన్ పిళ్ళై తమ వ్యాఖ్యానములో ఈ విధముగా చెప్పిరి – తిరుమలతో నిత్య సంబంధం ఉండాలని ఆళ్వార్ స్వయంగా తిరువేంకటేశ్వరుడిగా కావాలని కూడా ఆశించారు. భట్టార్ వారి ఉల్లేఖనను ఈ విధముగా చెప్పిరి “నేను అక్కడ ఉన్నానని నేను తెలుసుకోవలసిన అవసరం లేదు, లేదా నేను ఉన్నానని ఆ వేంకటేశ్వరుడు తెలుసుకోవలసిన అవసరం లేదు, అక్కడ నేను ఉన్నానని ఎవరూ కీర్తించాల్సిన అవసరం లేదు. అక్కడ ఏదో ఒక రూపంలో ఉంటే చాలు”.

కులశేఖరాళ్వార్లు తమ స్వలాభమును కాక్షించక పూర్తిగా భగవత్భాగవత సంబంధము కోసమే తపించెడివారు.

దీనిని మన మదిలో ఉంచుకొని వారి జీవిత చరిత్రను చూద్దాం.

శ్రీ కులశేఖర పెరుమాళ్ కొల్లినగర్ (తిరువన్జిక్కళమ్) అను రాజ్యములో క్షత్రియ వంశములో శ్రీకౌస్తుభం అంశముతో జన్మించిరి. వీరిని కొల్లి కావలన్, కొళియర్ కోన్, కూడల్ నాయకన్ మొదలగు నామములతో కూడా వ్యవహరించెదరు.

తనియన్లో వివరించినట్టు మాఱ్ఱలరై వీరంగెడుత్త శెంగోల్ కొల్లి కావలన్ విల్లవర్ కోన్  శేరన్ కులశేఖరన్ ముడివేందర్ శిఖామణియే” వీరు చేర రాజ్యమునకు రాజు, శత్రువులను నిర్మూలించే గొప్ప బలము కలిగిన రథములు, గుఱ్ఱములు, ఏనుగులు, శత్రువులను ప్రారదోలే సైనికులను కలిగి ఉండేవారు. ఆళ్వార్ శాస్త్ర బద్ధంగా రాజ్యాన్ని పాలించెడివారు, బలవంతులు బలహీనులను ఇబ్బంది పెట్టకుండా చూసుకుని, శ్రీరామడిలా తమ పాలనలో ఎంతో ఉదారంగా, వినయంగా ఉండేవారు.

గొప్ప మహారాజైనందున, తాను స్వతంత్రుడని, తన రాజ్యనియంత్రణ తమ అధీనములో ఉండాలని భావించేవారు. ఆ పరమపదాన్ని ఈ సంసారాన్ని రెండింటినీ నియంత్రిచువాడైన శ్రీమన్నారాయణుడు, తమ నిర్హేతుక కృపతో ఆళ్వారుకి రాజో/తమో గుణాలను తొలగించి, దివ్య జ్ఞానాన్ని అనుగ్రహించి, తన రూప, గుణ, విభూతి, చేష్టితాలను వెల్లడించిరి. భగవద్ విషయమందు ఆలోచన లేకుండా తమ శరీర అవసరములను గురించి మాత్రమే చింతించే సంసారులను చూసి ఆళ్వార్ వేదన చెందెను. నమ్మాళ్వార్లు చెప్పినట్లుగా సాంసారిక విషయాలు పెద్ద అగ్ని వంటిదని, అది మానవుని శారీరక అవసరములందు మరలా మరలా వ్యామోహమును పెంపొందిచునని గ్రహించిరి. కులశేఖరాళ్వార్లు తమ రాజ్యముతో ఎటువంటి సంబంధము పెట్టు కోకుండ శ్రీవిభీషనుడి వలే తమ సంపదను శ్రీ రాముని పాదాల వద్ద ఉంచి శరణు వేడెను.

లౌకిక విషయములను వదిలి, ఎల్లప్పుడూ శ్రీరంగనాథుని గుణాలను ఎవరు కీర్తించుదురో వారి ఎడల వ్యామోహమును పెంచు కొనిరి ఆళ్వారు. అధిక సమయమును శ్రీవైష్ణవులైన సాధువులతో  గడిపెడివారు. “అన్నియరంగన్ తిరుముట్రత్తు అడియార్” (అధికముగా తమ దినచర్యను శ్రీరంగనాథుని ఆలయములో గడిపెడివారు) అన్నట్లుగా గడిపెడివారు. ‘శ్రీరంగ యాత్ర చేయవలెననే కోరిక ఉంటే చాలు పరమపదము లభించునని’ అనే వాక్యముననుసరించి  సదా శ్రీరంగం గురించే ఆలోచించెడివారు.

అంతేకాకుండా, తిరుమల యందు, గంగా యమునాది నదుల కన్నా విశేషమైనదని కీర్తించబడే స్వామి పుష్కరిణిపై అధిక వ్యామోహమును ఏర్పరుచుకొనిరి. ఆండాళ్ కూడ  “వేంకటత్తైప్ పతియాగ వాళ్వీర్గాళ్” (సదా మానసికముగా తిరువేంకటముపై నివాసము చేయవలెను) అని చెప్పెను కదా. అక్కడ గొప్ప ఋషులు, మహాత్ములు నిత్యవాసము చేయుదురు. కారణం, వారు కూడా అదే విధమైన కోరికని కలిగి ఉన్నారు కనుక. పెరుమాళ్ తిరుమొళి 4వ పదిగంలో  తిరుమల దివ్యదేశములో పక్షిలా, చెట్టులా, రాయిలా, నదిలా ఉండవలెనని ఆళ్వార్ కోరికను చూసితిమి కదా ఇదివరకు. ఇది కాకుండా దివ్య దేశ పెరుమాళ్ళను వారి భక్తులను సేవించవలెనని కోరికను కలిగి ఉండిరి.

పురాణేతిహాసములను పరిశీలించి “ముకుంద మాల” అను సంస్కృత శ్లోక గ్రంథమును వ్రాసిరి.

శ్రీరామాయణము గొప్పతనమును తెలుపు శ్లోకం:

వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే |
వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా||

వేద వేద్యుడు, వేదము చేత తెలియ బడేవాడు దశరథాత్మాజుడిగా అవతరించినప్పుడు వేదము వాల్మీకి మహర్షి నుండి శ్రీరామాయణముగా అవతరించింది.

rama-pattabishekam

పై శ్లోక ప్రమాణంగా కులశేఖరాళ్వార్లు ప్రతిరోజు దినచర్యగా శ్రీరామాయణాన్ని శ్రవణం చేస్తు ప్రవచిస్తూ ఉండేవారు. ఆళ్వార్ ఒక్కొక్కసారి శ్రీరామాయణంలో తన్మయత్వంగా మునిగి తమను తాము మరచి పోతుండేవారు.

ఒకసారి ఉపన్యాసకుడు శ్రీరామాయణంలోని ఖరదూషణాదులు, పదనాల్గు వేల మంది రాక్షసులు శ్రీరామునితో యుద్ధానికి సిద్ధమవుతుండగా శ్రీరాముడు ఒక గుహలో సీతాదేవిని ఇళయ పెరుమాళ్ళ (లక్ష్మణుని) సంరక్షణలో ఉంచి తానొక్కడే పదనాల్గు వేలమంది రాక్షసులతో ఒంటి చేత్తో ఎదుర్కొనుచుండగా, ఋషులందరు భయముతో చూస్తుండే ఘట్టం ప్రవచిస్తున్నారు. అది విన్న ఆళ్వార్ నిష్ఫల భావోద్వేగముతో శ్రీరామునికి యుద్ధములో సహకరించుటకు తన సేనలకు యుద్ధరంగం వైపు వెళ్ళుటకు సిద్ధం కావల్సినదని ఆఙ్ఞాపించెను. దీనిని చూసిన మంత్రులు కొందరిని రాజు యాత్రకు ఎదురుగా వచ్చేలా చేసి వారితో  “మహారాజా శ్రీరాముడు యుద్ధములో విజయాన్ని వరించాడు, సీతాదేవి వారి గాయాలకు చికిత్స చేస్తున్నది, కావున మీరిక వెళ్ళవలసిన పనిలేదు” అని చెప్పించారు. ఆళ్వార్ సంతుష్టి చెంది తన రాజ్యానికి వెనుదిరిగారు.

మంత్రులందరు ఆళ్వార్ వింత ప్రవర్తన గురించి ఆలోచించి శ్రీవైష్ణవుల సంబంధ వ్యామోహము నుండి వీరిని విడదీయాలని నిర్ణయించుకొన్నారు. మంత్రులందరు రాజును శ్రీవైష్ణవుల నుండి దూరం చేయుటకు ఒక యుక్తిని పన్నారు. ఆళ్వార్ తిరువారాధన మందిరంలో నుండి ఒక వజ్రాల ఆభరనాన్ని దొంగిలించి, ఆ దొంగతనాన్ని అత్యంత సన్నిహితులైన శ్రీవైష్ణవులపై మోపుతారు.  ఇది తెలసిన ఆళ్వార్ విషనాగుతో ఉన్న ఒక కుండను తెప్పించి దానిలో తన చేతిని పెడుతూ “శ్రీవైష్ణవులు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడరు” అని తమ నిజాయితి కారణంగా పాము కాటువేదు. దీనిని చూసిన మంత్రులు సిగ్గుచెంది ఆ నగను తిరిగి ఇచ్చి ఆళ్వారుకు, ఆ శ్రీవైష్ణవులకు క్షమా ప్రార్ధన చేసిరి.

క్రమంగా, ఆళ్వార్ ఈ సంసారుల మధ్యన ఉండుటకు ఇష్టపడక, ‘శౌనక సంహిత’ లో చెప్పిన విధంగా “భగవంతుని కీర్తించని సంసారుల మధ్య నివసించుట ఒక అగ్ని గోళం మధ్యన ఉండుట లాటింది” అని విచారించిరి.

ఆళ్వార్ తన రాజ్య భారాన్ని, బాధ్యతలను తన కుమారుని చేతిలో ఉంచి, అతనికి పట్టాభిషేకం చేసి ఇలా నిర్ణయించుకొన్నాడు “ఆనాద శెల్వతత్తు అరంబైయర్గళ్ తార్చుళ వానాళుం శెళ్వముం మన్నాన్నరశుం యాన్ వేన్నాదెన్” (సేవకులచే పరివేష్టించబడి ఉండే వినోదాలను మరియు సంపదను ఇక కోరను).

ఆళ్వార్ తన సన్నిహితులైన శ్రీవైష్ణవులతో రాజ్యాన్ని వదిలి శ్రీరంగమును చేరి బంగారపు పళ్ళెములో వజ్రము వలె ఉన్న(ఆదిశేషునిపై పవళించి ఉన్న) శ్రీరంగనాథునికి మంగళాశాసనము చేసినారు. తన భావ సంతృప్తి ఫలముకై ప్రతి క్షణమును పెరుమాళ్ళను కీర్తిస్తు, “పెరుమాళ్ తిరుమొళి” రచించి అందరి ఉన్నతికై ఆశీర్వదించినారు. కొంత కాలము ఈ సంసారములో జీవించి చివరకు దివ్యమైన పరమపదమునకు వేంచేసి పెరుమాళ్ళకి నిత్య కైంకర్యమును చేసిరి.

ఆళ్వార్ తనియన్:

ఘుష్యతే  యస్య నగరే  రంగయాత్రా దినేదినే |
తమహం శిరసా వందే రాజానం కులశేఖరమ్ ||

వీరి అర్చావతార అనుభవం  క్రిత మేఇక్కడ చర్చించబడినది: – http://ponnadi.blogspot.in/2012/10/archavathara-anubhavam-kulasekara.html.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాసు

మూలము: https://acharyas.koyil.org/index.php/2013/01/18/kulasekara-azhwar-english/

పొందుపరిచిన స్థానము – https://acharyas.koyil.org/index.php/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org/index.php
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org