పిళ్ళై లోకాచార్యులు

శ్రీ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్ వరవరమునయే నమ:
శ్రీ వానాచల మహామునయే నమ:

గత సంచికలో మనం వడక్కు తిరువీధి పిళ్ళైల గురించి తెలుసుకున్నాం, ఇప్పుడు గురుపరంపరలో తరువాతి ఆచార్యుల  గురించి తెలుసుకొందాం.

పిళ్ళై లోకాచార్యులు – శ్రీరంగము 

తిరునక్షత్రము: ఆశ్వీయుజ మాసము (ఐప్పసి), శ్రవణము (తిరువోణమ్)

అవతార స్థలముశ్రీరంగము

ఆచార్యులు: వడక్కు తిరువీధి పిళ్ళై

శిశ్యులు: కూర కుళోత్తమ దాసర్, విళాన్ చోలై పిళ్ళై, తిరువాయ్మొళి పిళ్ళై, మణప్పాక్కతు నంబి, కోట్టుర్ అణ్ణర్, తిరుప్పుట్కుళి జీయర్, తిరుకణ్ణన్ గుడి పిళ్ళై, కొల్లి కావల దాసర్, మొదలైన వారు

పరమపదము చేరిన ప్రదేశము: జ్యోతిష్కుడి (మధురై దగ్గర)

శ్రీ సూక్తులు: యాదృచిక్క పడి, ముముక్షుపడి, శ్రియః పతి పడి, పరంద పడి, తని ప్రణవమ్, తని ద్వయమ్, తని చరమమ్, అర్థ పంచకము, తత్వ త్రయము, తత్వ శేకరం, సార సంగ్రహము, అర్చిరాది, ప్రమేయ శేకరం, సంసార సామ్రాజ్యము, ప్రపన్న పరిత్రాణము, నవరతిన మాలై, నవ విధ సంబంధం, శ్రీ వచన భూషణము మొదలైనవి.

పిళ్ళై లోకాచార్యులు శ్రీరంగము నందు వడక్కు తిరువీధి పిళ్ళైలకు నంపిళ్ళైల అనుగ్రహముతో జన్మించిరి. (వడక్కు తిరువీధి పిళ్ళై ఐతిహ్యము నందు ఇది వరకే చూసితిమి). వారు మరియు వారి తమ్ముడైన అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ శ్రీరంగము నందు అయోధ్యలో పెరుమాళ్ మరియు ఇళయ పెరుమాళ్ వలె గోకులములో కృష్ణ బలరాముల వలె పెరిగిరి. వీరిరువురు మన సాంప్రదాయముకు పట్టు కొమ్మలైన నంపిళ్ళై, పెరియ వాచ్చాన్ ప్పిళ్ళై, వడక్కు తిరువీధి పిళ్ళై మొదలగు గొప్ప ఆచార్య పురుషుల కటాక్షము మరియు ఉపదేశములచే పెరుగుటకు పెట్టి పుట్టిరి. మన సంప్రదాయమును వారి తండ్రిగారైన వడక్కు తిరువీధి పిళ్ళైల శ్రీ చరణముల వద్దనే అభ్యసించిరి. ఆలానే ఈ ఇరువురి ఆచార్య సింహములకు ఒక్క ప్రత్యేక విశేషము ఏమనగా వారు జీవితాంతము నైష్ఠిక బ్రహ్మచారులుగా ఉంటామని ప్రతిజ్ఞ చేసిరి అట్లే ఉండిరి.

పిళ్ళై లోకాచార్యులు ఈ సంసారము నందు జీవాత్మలు అనుభవించుతున్న బాధలను చూసి వారి అపారమైన కారుణ్యముతో మరియు వారి స్వప్నములో పెరియ పెరుమాళ్ళు ఇచ్చిన ఆఙ్ఞ వలన, మన సాంప్రదాయములోని రహస్యార్థములు ఏవైతే ఆచార్య ముఖేన శిష్యుడు నేర్చుకుంటాడో వాటనింటినికి గ్రంథములు రాసారు.

పిళ్ళై లోకాచార్యులు మన సంప్రదాయమునకు నాయకుడై వారి శిశ్యులకు శ్రీరంగము నందు ప్రతి నిత్యం పాఠములను నేర్పుచుండిరి. మణప్పాక్కతు నంబి అనే ఒక శ్రీవైష్ణవుడు దేవపెరుమాళ్ దగ్గరికి చేరిరి, దేవపెరుమాళ్ అతనికి మన సాంప్రదాయములోని అమూల్యమైన విషయములను కొన్నింటిని ఉపదేశించి, మిగిలినవి శ్రీరంగం చేరిన తరువాత ఉపదేశించెదని చెప్పిరి. అప్పుడు నంబి శ్రీరంగమునకు తిరిగి ప్రయాణమై కాట్టళగియ శింగర్ గుడి వద్దకు వచ్చి చేరిరి, అక్కడ పిళ్ళై లోకాచార్యుల కాలక్షేప గోష్టిని చూసిరి. ఒక స్తంభము వెనుక దాక్కొని, పిళ్ళై లోకాచార్యుల ప్రవచనమును వింటూ ఆశ్చర్యము చెందిరి, కారణము ఎక్కడైతే దేవ పెరుమాళ్ ఆపి వేశారో అక్కడ నుండే వారు చెప్పుతున్నారు. స్తంభములందు బయటకి వచ్చి, పిళ్ళై లోకాచార్యుల శ్రీ చరణములందు సాష్టాంగము నమస్కారం చేసి ఈ విధముగా అడిగిరి “అవరో నీర్” (మీరు దేవ పెరుమాళ్ళా?) పిళ్ళై లోకాచార్యులు సమాధానము “ఆవతు; యేతు?” (అవును, ఏమి చేయవలెను ఇప్పుడు?). ఆ విధముగా మనము పిళ్ళై లోకాచార్యులు వేరెవరో కాదు వారే దేవ పెరుమాళ్ళు అని తెలుసుకోవచ్చు.

యతీంద్ర ప్రవణ ప్రభావములో మరొక సంఘటన ద్వారా దేవ పెరుమాళ్ తానే పిళ్ళై లోకాచార్యులుగా అవతరించెనని రుజువు అవుతుంది. పిళ్ళై లోకాచార్యులు జ్యోతిష్కుడిలో చివరి దశలో ఉన్నప్పుడు, నాలూర్ పిళ్ళైలను వ్యాఖ్యానమును తిరుమలై ఆళ్వార్లకు (తిరువాయ్మొళి పిళ్ళై) ఉపదేశించమని ఆఙ్ఞాపించిరి. అప్పుడు తిరుమలై ఆళ్వార్ దేవ పెరుమాళ్ళ మంగళాశాసనము కొరకు వెళ్ళినప్పుడు, దేవ పెరుమాళ్ నాలూర్ పిళ్ళై ప్రక్కన నిలబడి ఉండగా స్వయముగా మాట్లాడి, ఈ విధముగా చెప్పెను “జ్యోతిష్కుడిలో నేను ఆదేశించిన ప్రకారముగా మీరు తిరుమలై ఆళ్వార్లకు అరుళి చ్చెయల్ అర్థములను నేర్పించండి”.

పిళ్ళై లోకాచార్యులు ముముక్షుల (భగవత్ కైంకర్య మోక్షమును కోరుకునేవారు) ఉజ్జీవనము కొరకు ఎన్నో గ్రంథములను వ్రాసిరి. వారు ముఖ్యముగా మన సంప్రదాయము కొరకు 18 రహస్య గ్రంథములను వ్రాసిరి, అవే రహస్య త్రయము, తత్వ త్రయము, అర్థ పంచకము మరియు తిరువాయ్మొళిని ఆధారముగా చేసుకొని లోతైన సంప్రదాయ అర్థములను వ్రాసిరి. వాటిలో క్రింద చెప్పబడినవి చాలా ముఖ్యముగా పరిగణించబడినవి~:

  • ముముక్షుపడి – రహస్య త్రయము చాలా వైభవముగా ఈ గ్రంథములో వివరించబడెను. మాముణులు ఈ గ్రంథమునకు వివరమైన వ్యాఖ్యానము వ్రాసిరి. ప్రతీ శ్రీవైష్ణవులకి ఇది మూలాధారమైనది, దీని సహయము లేనిదే మనము తిరుమంత్రము, ద్వయము మరియు చరమ శ్లోకముల గొప్పతనమును అర్థము చేసుకోలేము.
  • తత్వ త్రయము – దీనికి గల మరో పేరు కుట్టి భాష్యము (చిన్న శ్రీభాష్యము). పిళ్ళై లోకాచార్యులు ముఖ్యముగా చిత్, అచిత్ మరియు ఈశ్వర తత్వమును శ్రీభాష్యము మూలముగా చేసుకొని వివరించిరి. మరలా, మాముణుల వ్యాఖ్యానము లేనిదే ఈ గ్రంథము యొక్క గొప్పతనమును పూర్తిగా అర్థము చేసుకోలేము.
  • శ్రీవచన భూషణ దివ్య శాస్త్రము – ఈ గ్రంథము పూర్తిగా ఆళ్వారుల మరియు ఆచార్యుల వాక్కుల ఆధారంగా వ్రాయబడెను. ఇది పిళ్ళై లోకాచార్యుల మహత్తరమైన సత్ సాంప్రదాయ అర్థముల వివరణముగా విశదీకరించబడిన గ్రంథము. ఇది సంప్రదాయము యొక్క లోతైన అర్థములను వెలికి తీయును, ఈ గ్రంథమునకు మాముణులు దివ్యమైన వ్యాఖ్యానమును వ్రాసిరి. తిరునారాయణపురతు ఆయి కూడా ఈ గ్రంథమునకు వ్యాఖ్యానమును వ్రాసిరి.

శ్రీ వైష్ణవులు మన సాంప్రదాయము యొక్క విశిష్టతను అభినందిచుట కొరకు ఒక్కసారైనను ఈ గ్రంథము యొక్క వ్యాఖ్యానమును వినవలెను.

పిళ్ళై లోకాచార్యుల గొప్పతనము ఏమనగా, ఎవరికైనా దీని యెడల కోరిక ఉన్నట్టైతే చాలు చాలా సులభముగా అర్థము చేసుకొనే విధముగ వారు ఈ గ్రంథమును సులభ తమిళ (మణి ప్రవాళము) భాషలో వ్రాసిరి. ముముక్షువులు సంప్రదాయ అర్థములను తెలుసుకొనుటకు గల అవరోధములను గుర్తించిన వారై, వారి ఆచార్యుల ద్వారా వినినది విన్నట్టుగా కరుణతో వ్రాసిరి – ఈ గ్రంథములోని గల అన్ని అర్థములని చూస్తే సూటిగా మనము వాటిని మన పూర్వాచార్య వ్యాఖ్యానములలో, ఈడు 36000 పడి వ్యాఖ్యానములు మరియు ఇతర పూర్వాచార్యుల గ్రంథములలో (పిళ్ళై లోకాచార్యులకు పూర్వము) చూడవచ్చును. వారు కరుణతో అన్నిటినీ చేర్చి గ్రంథములను స్పష్టముగా మరియు సులభమైన భాషలో వ్రాసిరి. ఈ విధముగా మనము వీరిని ప్రమాణ రక్షణము (ఙ్ఞానమును రక్షించి/పెంచే ) చేసిన ముఖ్య ఆచార్యులుగా అర్థము చేసుకోవచ్చును.

ఒక ప్రమాణ రక్షణము మాత్రమే కాకుండా, వారు పూర్తిగా ప్రమేయ రక్షణమును (ఎమ్పెరుమానులను రక్షించి/పెంచే) కుడా చేసిరి. శ్రీరంగము చక్కగా విలసిల్లుతునప్పుడు, ఒక్కసారిగా ముస్లిముల దండయాత్ర భయంకరమైన అగ్నివలె వ్యాపించెను. మహమ్మదీయుల రాజులు గుడిలోని సంపదను అపహరించుటలో పేరు మోసినవారు, ఏమి చేయవలెనో తెలియక అందరు కలత చెందిరి. ఆలస్యము చేయక పిళ్ళై లోకాచార్యులు (ఆ సమయములో వారే ముఖ్యమైన శ్రీవైష్ణవ ఆచార్యులు) పరిస్థితిని అదుపులోకి తీసుకోవటానికి ప్రయత్నం చేసిరి. శ్రీవైష్ణవులను పెరియ పెరుమాళ్ళకు ఎదురుగా ఒక గోడను నిర్మించమని చెప్పి వారు నమ్పెరుమాళ్ మరియు ఉభయ దేవేరులలతో కూడి దక్షిన భారతమునకు వెళ్ళిరి. వారు వృద్దాప్యమును కూడా లెక్క చేయక నమ్పెరుమాళ్ళతో కూడి ప్రయాణమైరి. అప్పుడు వారు అడవుల వెంబడి ప్రాయాణించుచుండగా కొందరు దొంగలు వచ్చి నమ్పెరుమాళ్ళ తిరువాభరణములను దొంగిలించిరి. పిళ్ళై లోకాచార్యులు కొంత దూరము వెళ్ళిన తదుపరి ఆ వార్తని విని తిరిగి వెనుకకు రాగా ఆ దొంగలు పిళ్ళై లోకాచార్యులను చూసి మనసు మారి, ఆభరణములను తిరిగి వారికి ఇచ్చివేసెను.

తరువాత జ్యోతిష్కుడి (మధురై దగ్గర – ఆనై మలై ప్రదేశమునకు వెనుక) అనే ప్రదేశమునకు చేరిరి. పిళ్ళై లోకాచార్యులు వయోతిగమ్ (పెద్ద వయసు) వలన ఆనారోగ్యముచే పరమపదము చేరుటకు నిర్ణయించుకొనిరి. వారి శిష్యులలో ఒకరైన తిరుమలై ఆళ్వార్ని (తిరువాయ్మొళి పిళ్ళై) సాంప్రదాయమునకు తదుపరి నాయకుడిగా దిద్దుబాటు చేయాలని ఆలోచిస్తారు. వారు వారి శిశ్యులతో (ముఖ్యముగా కూరకులోత్తమ దాసర్),  తిరుమలై ఆళ్వార్ని తన యొక్క పరిపాలన భాద్యతల నుండి తప్పించి దరిశన ప్రవర్తకులుగా సంస్కరించమని ఆదేశించిరి. అక్కడే వారు తమ యొక్క చరమ తిరుమేనిని వదిలి పరమపదమునకు బయలుదేరిరి.

జ్యోతిష్కుడి – పిళ్ళై లోకాచార్యులు పరమపదము చేరిన ప్రదేశము

మణవాళ మాముణులు ఉపదేశ రత్తిన మాలైలో పిళ్ళై లోకాచార్యులు మరియు వారి యొక్క శ్రీవచన భూషణ దివ్య శాస్త్రముల గొప్పతనమును గురించి వ్రాసిరి. వారు ఆళ్వారుల ఆచార్యుల అవతారముల గురించి, మన సంప్రదాయంను ఆశ కలిగిన వారందిరికి అందేతట్టుగా దానిని విస్తరింప చేసిన మహనీయులైన ఎమ్ఫెరుమానురుల కృప గురించి, తిరువాయ్మొళి యొక్క వ్యాఖ్యాన అవతారములను గురించి, మరియు పిళ్ళై లోకాచార్యులు అవతారము, శ్రీవచన భూషణ దివ్య శాస్త్రము యొక్క గొప్పతనమును, వాటి అర్థ విశేషముల గురించి వివరించారు. చివరగా మనము అందులో చెప్పిన విధముగా మన జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయాలి అట్లు జీవించ గలిగితే మనము ఎమ్పెరుమానురుల కృపకు సత్ పాత్రములు కాగలము పూర్వాచార్యుల ఙ్ఞానం మరియు అనుష్టానము నందు పరిపూర్ణమైన విశ్వాసం లేక, తోచిన విధముగా తర్కముచే స్వంత అర్థములను సృష్టించితే, అట్టి వారులను అవివేకులని పిల్చుదురు అని చెప్పిరి. మాముణులు ఎప్పుడూ అప శబ్దములను వాడరు (అవివేకి అను పదములు మొద,) అట్టి వారు, కఠినమైన (“మూర్కర్” – మూర్ఖులు) పద ప్రయోగం ఇక్కడ చేసారు, ఇది పూర్వాచార్యులందు నమ్మకము లేక నటించడము/మాట్లడడము ఎంతటి కౄరత్వమైన చర్యయో సూచించును. ఇదీ మాముణులు శ్రీవచన భూషణ దివ్య శాస్త్రము యొక్క సారమును తన అద్బుతమైన ఉపదేశ రత్తిన మాలై ప్రబంధమున తెలిపిరి.

వేదాంతాచార్యులు (నిగమాంత మహా దేశికన్) ఒక అద్భుతమైన ప్రబంధమును వ్రాసిరి, లోకాచార్య పంచాశత్ పిళ్ళై లోకాచార్యులుల కీర్తిని తెలియచేయును. వేదాంతాచార్యులు సుమారు 50 సంవత్సరములు పిళ్ళై లోకాచార్యర్ల కన్నా చిన్నవారు వారిని గొప్పగా ప్రశసించడం, ఈ గ్రంథము ద్వారా మనము సులభముగా అర్థము చేసుకోవచ్చును, ఇప్పటికినీ తిరునారాయణపురములో రోజూ ఈ గ్రంథము పఠించుదురు. సులభమైన ఆంగ్ల అనువాదము  శ్రీ ఉ. వె. V V రామానుజం స్వామి వారి గ్రంధముపై ఆధారపై శ్రీ ఉ. వె. T C A వేంకటేశన్ స్వామివారి లోకాచార్య పంచాశత్ ఇక్కడనుండి డౌన్ లోర్డ్ చేసుకోవచ్చు http://acharya.org/books/eBooks/vyakhyanam/LokacharyaPanchasatVyakhyanaSaram-English.pdf.

ఈ విధముగా మనము పిళ్ళై లోకాచార్యులు యొక్క అపారమైన కీర్తిని, తమ జీవితాన్ని ప్రమాణ రక్షణము మరియు ప్రమేయ రక్షణమునకై అర్పించిన విధమును అర్థము చేసుకోవచ్చును. ఎవరైనా ఒకరు మేము శ్రీవైష్ణవులము అని చెప్పుటకు ముందు ఎల్లప్పుడూ పిళ్ళై లోకాచార్యులకు తప్పక కృతఙ్ఞతను (ఉపకార స్మృతి) చెప్పవలెను, కారణము వారు లేకపోతే మనము నంపెరుమాళ్ని కాని ఎమ్పెరుమానార్ దరిశనమ్ యొక్క లోతైన అర్థములను కాని తెలుసుకోలేకపోయే వారము.

మనకు ఎల్లప్పుడు ఎమ్పెరుమానార్ల యందు మరియు మన ఆచార్యులందు ఆ విధమైన సంభందమును కలిగేలా పిళ్ళై లోకాచార్యుల శ్రీ చరణములను ఆశ్రయించుదాము.

పిళ్ళై లోకాచార్యుల తనియన్

లోకాచార్య గురవే క్రిష్ణ పాదస్య సూనవే!
సంసార భోగి సంతష్ట జీవ జీవాతవే నమః !!

మంగళాశాసనము పిళ్ళై లోకాచార్యులకు వారి గోష్టికి

వాళి ఉలగాశిరియన్ వాళి అవన్ మన్ను కులమ్
వాళి ముడుంబై ఎన్ను మానగరమ్
వాళి మనమ్ చూళ్ంత పేరిన్బ మల్గుమిగు నల్లార్
రిణమ్ చూళ్ంత ఇరుక్కుమ్ ఇరుప్పు

మన తదుపరి సంచికలో, తిరువాయ్మొళి పిళ్ళై వైభవమును చూద్దాము.

రఘు వంశీ రామానుజ దాసన్

మూలము: https://acharyas.koyil.org/index.php/2012/09/18/pillai-lokacharyar-english/

పొందుపరిచిన స్థానము – https://acharyas.koyil.org/index.php/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org/index.php
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

22 thoughts on “పిళ్ళై లోకాచార్యులు”

Comments are closed.