నంజీయర్

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

గత  సంచికలో  పరాశర భట్టర్ గురించి మనము తెలుసుకున్నాము. ఇప్పుడు గురుపరంపరలో తరువాత ఆచార్యుల  గురించి తెలుసుకొందాం.

నంజీయర్ - తిరునారాయణపురం
నంజీయర్ – తిరునారాయణపురం

తిరు నక్షత్రం : ఫాల్గుణ మాసము, ఉత్తరా నక్షత్రము
అవతారస్థలం : తిరునారాయణపురం
ఆచార్యులు : పరశర భట్టర్
శిష్యులు : నంపిళ్ళై, శ్రీసేనాధి పతి జీయర్, మరికొందరు
పరమపదించిన ప్రదేశము : శ్రీరంగం
శ్రీసూక్తి గ్రంధములు: తిరువాయ్మొళి 9000 పడి వ్యాఖ్యానము, కణ్ణినుణ్ శిఱుత్తాంబు వ్యాఖ్యానము, తిరుప్పావై వ్యాఖ్యానము, తిరువందాది వ్యాఖ్యానములు, శరణాగతి గద్య వ్యాఖ్యానము, తిరుపల్లాండు వ్యాఖ్యానము, రహస్య త్రయ వివరణ గ్రంధము (నూఱెట్టు 108) – ఈ గ్రంథములలో చాల వరకు మనకు అందుబాటులో లేవు.

శ్రీమాధవర్ అను నామధేయముతో జన్మించి అద్వైత సిద్ధాంతమున గొప్ప తత్వవేత్తగ ప్రసిద్ధి పొందారు. తరువాత భట్టర్ వీరికి నంజీయర్ అని నామకరణము చేసారు. వీరికి నిగమాంత యోగి, వేదాంతి అను పేర్లు కూడ కలవు.

మాధవాచార్యులు గొప్ప అద్వైత తత్వవేత్తగా తిరునారాయణ పురము నందు నివసించిరి. ఎంబెరుమానార్లు వీరికి మన సంప్రదాయములోకి తీసుకువాలని సంకల్పించిరి. అద్వైత సంప్రదాయమునకు చెందినవారు అయినప్పటికిని, ఎంబెరుమానార్లకు వారి యందు గౌరవము కలదు. వారిని సంస్కరించు బాధ్యత భట్టర్లకు అప్పగించిరి.

భట్టర్ వైభవమును అప్పటికే తెలుసుకున్న మాధవచార్యులు వారిని కలుసుకొను సమయము కొరకు వేచివున్నారు. ఎంబెరుమానార్ల కోరిక మేరకు భట్టర్లు తిరునారాయణ పురమునకు వెళ్ళెను. పిదప భట్టర్లు వారిని వాదనలో జయించి వారిని శిష్యులుగా స్వీకరించెను. (ఆ వృత్తాంతమును మీరు ఇక్కడ చదవవచ్చు). భట్టర్ ఒక సాధారణ వేషముతో వారి దగ్గరకు వచ్చి వారిని ఓడించిన సంగతి; వాదన ముగిసిన అనంతరం భట్టరుతో వచ్చిన శ్రీవైష్ణవ బృందం మాధవాచార్యుల ఇంటికి వచ్చినప్పుడు తెలుసుకున్నారు. ఆ శ్రీవైష్ణవ బృందం యొక్క ఆనందమునకు సంతసించిన మాధవాచార్యులు భట్టర్ వైభవమును కళ్ళారా చూసి గ్రహించెను.  భట్టర్లు శ్రీరంగము నుంచి ఎంతో ప్రయాసకోర్చి, వారి వైభవమును పక్కకు పెట్టి, సాధారణ వ్యక్తిగా వచ్చి మాధవాచార్యులను సంస్కరించి వారికి శాస్త్రార్ధములను బోధించిన భట్టర్లకు ఏ విధముగ ఋణము తీర్చుకోవాలో తెలియ చేయవలసిందిగా భట్టర్లను అడిగెను. భట్టర్లు చాల సులువుగ అరుళిచ్చెయల్, ఇతర సాంప్రదాయ గ్రంథములను పఠించి వాటిలో నిష్ణాతులై, శ్రీరంగమునకు రావలసినదిగా ఆదేశించెను.

మాధవాచార్యుల భార్యలు వారి కైంకర్యములకు అడ్డుగా ఉండుట చూసి, ఆచార్యని ఎడబాటు సహించలేక శ్రీరంగమునకు వెళ్ళి వారి ఆచార్యుల సేవ చేసుకొనుటకు సన్యాస అశ్రమమును స్వీకరించ దలచెను. వారి అపారమైన సంపదను 3 భాగములుగా చేసి, 2 భాగములు వారి ఇద్దరి భార్యలకు (శాస్త్ర ప్రకారము సన్యసించ దలిచినవారు, తమ ధర్మ పత్ని సంరక్షణ భారము పూర్తి గావించిన పిదప తీసుకోవలెను) పంచి సన్యాసాశ్రమమును స్వీకరించెను. పిమ్మట వారు శ్రీరంగమునకు బయలుదేరెను. దారిలో అనంతాళ్వాన్లు కలసి వారిని సన్యాసాశ్రమమును స్వీకరించ దలచిన కారణమును అడిగెను. వారు భట్టరు దగ్గరకు వెళ్ళి, వారిని సేవ చేసుకుంటే (గురువు సేవ) ఎలాగైనా పెరుమాళ్ళు మోక్షమును ప్రసాదించునని బదులు చెప్పిరి. అప్పుడు ఆళ్వాన్లు “తిరుమంత్రములో జన్మించి (ఆత్మ స్వరూపము) ద్వయ మంత్రములో పెరిగమని (పెరుమాళ్ళకు, పిరాట్టికి కైంకర్యమును చేసుకుంటు) దీవించెను. భట్టర్లు మాధవాచార్యుల ఆచార్య నిష్టను గమనించి వారిని నంజీయర్ అని పిలిచెను. ఆ నాటి నుండి వారు నంజీయరుగా ప్రసిద్ధి పొందెను.

భట్టర్లు మరియు నంజీయర్లు ఉత్కృష్టమయిన ఆచార్య – శిష్య సంబంధమును అనుభవించెను. నంజీయర్ వారి ఆచార్యుల కోసము, అన్నింటిని త్యజించి తమ ఆచార్యులతో ఉండెను. భట్టర్లు వారికి తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్ వారి 6000 పడి వ్యాఖ్యానము ప్రకారము తిరువాయ్మొళిని నేర్పించెను. భట్టర్లు నంజీయర్లకు తిరువాయ్మొళికి వ్యాఖ్యానమును అనుసంధించమనగా వారు 9000 పడి వ్యాఖ్యానమును రచించెను. తిరువాయ్మొళి కాలక్షేపమును వారు జీవించిన 100 ఏండ్ల కాలములో 100 మార్లు చెప్పిన ఘనత నంజీయర్లకే సొంతము.

నంజీయర్ల వారి ఆచార్య భక్తి వర్ణనాతీతం. వారి ఆచార్య భక్తిని కొన్ని సంఘటనల ద్వారా తెలుసుకొనే ప్రయత్నము చేద్దాము.

  • ఒకనాడు భట్టర్లు పల్లకిలో వెళుతుండగా నంజీయర్లు ఒక చేతితో త్రిదండమును ధరించి ఒక భుజముపై వారి పల్లకిని మోయుటకు ప్రయత్నించెను. అది గమనించిన భట్టర్లు వారిని పిలచి, ఇది తగదు అని, సన్యాసాశ్రమమున ఉండు వారు ఇలా పల్లకిని మోయరాదని చెప్పెను. నంజీయర్లు “మీ సేవకు ఈ త్రిదండము అడ్డుగా ఉన్న ఎడల దానిని విరిచి, సన్యాసాశ్రమమును త్యజించును” అని బదులిచ్చెను.
  • ఒకనాడు నంజీయర్ల పరిచారకులు భట్టర్ల రాకతో వారి తోటలో కొద్దిగ అల్లరి జరుగుతుందని వారు అడ్డుగా ఉన్నారని ఫిర్యాదు చేసెను. అప్పుడు నంజీయర్లు ఆ తోట భట్టర్ల కైంకర్య రూపముగా ఉన్నదని, నంపెరుమాళ్ళ కోసము కాదని వారిని మందలించిరి.
  • ఆచార్యులు వారి శిష్యుల ఒడిలో తల పెట్టుకొని విశ్రాంతి పొందుట సాధారణము.
    ఒకనాడు భట్టర్లు పడుకొన దలచి నంజీయర్ల ఒడిలో తన తలను పెట్టుకొని విశ్రాంతి పొందుచుండెను. భట్టర్లు చాల సేపటి తరువాత మెలుకువ వచ్చి చూడగా నంజీయర్లు ఆ సమయమున కదలకుండ ఉండెనన్న విషయమును గ్రహించి, వారి ఆచార్య నిష్ఠకు ప్రసన్నులై వారికి ద్వయ మంత్ర అర్ధమును ఉపదేశించెను. (ఆచార్యులు వారి శిష్యుల నడవడి నచ్చిన పిదప వారికి అర్ధములను బోధించును.)
  • నంజీయర్లు అరుళిచెయల్ అన్నింటిలోను నిష్ణాతులు అయ్యిరి. భట్టర్లు నంజీయర్లు అరుళిచ్చెయల్ పాశుర అనుసంధాన సమయమున వాటికి అద్భుతమైన అర్ధములను చెప్పేవారు. ఒకనాడు నంజీయర్లు తిరువాయ్మొళి 7.2.9 “ఎన్ తిరుమగళ్ చేర్ మార్వనే ఎన్ఱుమ్ ఎన్నుడైయావియే ఎన్ఱుమ్” పాశుర అనుసంధానము చేయుచుండగ – వారు ఆ పాశురములోని వాక్యము విడమరచకుండ సేవించెను. అది విని భట్టర్లు వెంటనే మూర్చ పోయెను. తెలివి వచ్చిన పిమ్మట భట్టర్లు ఆ వాక్యమును అలానే చదవవలెనని, అప్పుడు మాత్రమే మనకి పరాంకుశ నాయకి మనస్సులోని భావము అర్ధమవుతుందని చెప్పెను. ఆ వాక్య అర్ధము కలిపి చడివితే ఈ విధముగ ఉండును “శ్రీరంగ నాచ్చియార్లను హృదయమందు గల శ్రీరంగనాథుడు నాకు అతి ప్రియం” అని ఆళ్వార్ల భావన. అదే వాక్యమును విడ మరచి చదివితే “శ్రీరంగనాథుడి మది యందు శ్రీరంగ నాచ్చియార్లు కలరు. అలాంటి రంగనాథుడు నాకు అతి ప్రియం అని అర్ధము వచ్చును.
  • తమిళ దేశము కాని, సంస్కృత వేదాంతి యగు నంజీయర్లను వారి అరుళిచ్చెయల్ తత్వ జ్ఞానమును పలు మార్లు భట్టర్లు ప్రశంసించెను.

నంజీయర్లు భట్టర్ల మధ్య అనేక ఆసక్తికరమగు సంభాషణలు జరిగెను. ఎంత పెద్ద పండితుడు అయినప్పటికి నంజీయర్లు వారికి వచ్చిన సందేహాలను భట్టర్ల యదుట ఉంచి వాటిని వివరించమని కోరుటలో ఎన్నడూ సంకోచించలేదు. వారి మధ్య సంభాషణలు కొన్ని ఇప్పుడు చూద్దాము.

  • నంజీయర్లు ఒకనాడు భట్టర్లను ఎందు వలన ఆళ్వార్లు కృష్ణ పరమాత్మ యందు ఎక్కువ ప్రియంగా ఉండేవారు అని అడిగెను. ఇటీవల జరిగిన విషయములను గుర్తు పెట్టుకోవడము సహజమని, అందువలన కృష్ణావతారము భగవానుడి ఇటీవల అవతారము కావున వారిని కలవడము ఆళ్వార్లకు కుదరకపోవడము వలన కృష్ణుడి యందు ప్రేమని వ్యక్తపరిచెనని చెప్పెను.
  • భగవానుడు గోప కులమున జన్మించిన పరమాత్మను (కృష్ణాడు), అతను ఎక్కడికి వెళ్ళినను, కంసుడి భటులు చంపుటకు సిద్ధముగా ఉండేవారు. కాని రామావతారమున అస్త్ర విద్యలు నేర్చుకున్నారు. తన తండ్రి దశరధుడు కూడా గొప్ప యోధుడు. తన సోదరులు కూడ ఎంతో ధైర్యవంతులు, శక్తిమంతులు కూడా. అందువలన పెరియాళ్వార్లు కృష్ణ భగవానుని యందు భయముతో వారికి కాపలా గాచెను అని భట్టర్లు వివరణ నిచ్చెను.
  • కలియన్ ఆళ్వార్లు తిరుమొళి “ఒరు నల్ సుఱ్ఱమ్” పదిగము (తిరుమొళి చివర పాశురములు) నందు అనేక దివ్యదేశ పెరుమాళ్ళకు మంగళాశాసనము చేసెను. నంజీయర్లు ఇదే విషయము విన్నవించి ఎందుకు అలా చేసారు అని అడుగగా, ఒక ఆడపిల్ల పెళ్ళి చేసుకొని తన భర్త ఇంటికి పోవు సమయమున ఏ విధముగా తన స్నేహితుల ఇండ్లకు త్వరగా వెళ్ళి పలకరించునో అదే విధముగా ఆళ్వార్లు పరమపదమునకు బయలుదేరుటకు సిద్ధము- గనుండుట వలన భూలోకమున ఉన్న పెరుమాళ్ళందరికి ఒక సారి త్వరగా మంగళాశాసనమును చేసెను అని వివరించెను.
  • ప్రహ్లాదుడు వారి మనమడైన మహాబలి పెరుమాళ్ళను గౌరవించుట లేదని తన సంపదను కోల్పోవుగాక అని శపించెను. సంపద యందు ఏ విధమయిన కోరిక, ఆసక్తి లేని ప్రహ్లాదుడు ఎందువలన ఈ విధముగ శపించెనో అని అడుగగా; ఒక కుక్కను (సరిదిద్దుటకు) శిక్షించుటకు అది తినెడి మట్టిని ఏ విధముగ దాని దగ్గర నుండి తీసి వేయుదుమో, అదే విధముగా ప్రహ్లాదుడు మహాబలికి ప్రియమైన సంపదను దూరముచేసెనని వివరణ ఇచ్చెను.
  • వామన చరిత్ర యందు మహాబలి పాతళమునకు, శుక్రాచార్యులు తన కన్ను కోల్పోవునకు కల కారణమును నంజీయర్లు అడుగగా, శుక్రాచార్యులు మహాబలి దానము చేయుటకు అడ్డుపడి నందుకుగాను తన కన్నును, ఆచార్యుల మాట విననందుకు మహాబలి పాతాళమునకు వెళ్ళెనని వివరించెను.
  • దశరథుడు పెరుమాళ్ళని విడిచి ఉండలేక వెంటనే ప్రాణములను విడచినప్పటికి స్వర్గమునకు వెళ్ళెను ఎందువలన అని నంజీయర్లు అడుగగా; దశరథుడు సామాన్య ధర్మమునకు (సత్యవాక్ పాలనకు) కట్టుబడెనని, అందువలన వారు పెరుమాళ్ళ రక్షణ కోరలేదని, అందువలన నరకమునకు వెళ్ళవలసినది అని చెప్పి, పెరుమాళ్ళ తండ్రి అగుటచే వారి దయ వల్లన నరకమును తప్పించి స్వర్గమునకు పంపెనని చెప్పెను.
  • విభీషణుడు భక్తుడు అయినప్పటికి, సుగ్రీవుడు ఎందు వలన తమ కూటమిలో చేర్చుకొనుటకు ఇష్ట పడలేదని నంజీయర్లు అడుగగా, ఏ విధముగా పెరుమాళ్ళు తన భక్తులను రక్షించుటకు సిద్ధ పడెనో అదే విధముగా సుగ్రీవుడు కూడ తనకి శరణాగతి చేసిన (రాముడు ఒకనాడు సుగ్రీవుడిని సహాయము కోరుతాడు) వారిని కాపాడు కొనుచున్నాడు. విభీషణుడు పెరుమాళ్ళకు హాని చేయునేమో అని సుగ్రీవుడి భయమని వివరణ ఇచ్చెను.
  • కృష్ణుడు కంసుడిని వధించి దేవకి వసుదేవులను విడిపించగా, దేవకి మాతృత్వం వలన తన స్ధనముల యందు పాలు పుట్టగా, కృష్ణుడు చిన్నవాడు కానప్పటికి పాలును తాగెను. అది ఎట్లు కుదురును అని నంజీయర్లు అడుగగా, అది తల్లి కొడుకుల మధ్య విషయము మనము ఎవరము అడుగటానికి అని సరదాగ చెప్పిరి. అసలు తల్లి కానటువంటి, ప్రేమ లేనటువంటి పూతన పాలు ఇచ్చినప్పుడు కృష్ణుడు తాగెను. సొంత కన్న తల్లి తన యందు అమితమైన ప్రేమతో పాలు పడితె, వారు తాగరు అని అర్ధము చేసుకోవడములో కష్టమేమిటి అని ప్రశ్నించి సమాధనమునిచ్చెను.
  • భట్టర్లు ఒకనాడు యయాతి చరిత్రమును ఉపన్యాసములో భాగముగ చెప్పెను. యయాతి 100 అశ్వమేద యాగములను చేసి, స్వర్గమునకు చేరి ఇంద్రుని పదవిలో భాగము కోరెను. పదవి పంచుకొనుటకు ఇష్టము లేని ఇంద్రుడు యయాతిని తప్పు చేయు విధముగా ప్రణాలికను రూపుదిద్ది, అతనిని క్రిందకి పడవేసెను. నంజీయర్లు ఈ వృత్తంతమును ఎందుకు చెప్పెనో అని అడుగగా, ఈ చరిత్ర మనకు భగవానుడి గొప్పతనమును, ఇతర దేవతలలోని లేనిది తెలియచేయునని చెప్పెను. పెరుమాళ్ళు తనకి శరణాగతి చేసిన వారి అందరికి సామ్యాపత్తి మోక్షమును ప్రసాదించునని, అదే ఇతర దేవతలు 100 అశ్వమేద యాగములు చేసినప్పటికి కూడా వారితో సమానముగ చుసుకొనుటకు ఇష్ట పడరని క్రిందకు పడివేయునని చెప్పి వివరణ ఇచ్చెను.

ఇలాంటి సంభాషణలు ఎన్నో మనకు అరుళిచ్చెయల్, శాస్త్ర రహస్యములు తెలియచేయును. ఈ సంభాషణలు అన్ని నంజీయర్ల అరుళిచ్చెయల్ ప్రావీణ్యతను వారి శిష్యులకు అర్ధములు చెప్పుటకు పునాది వేసెను.

నంజీయర్లు ఒకనాడు తమ 9000 పడి వ్యాఖ్యానమును లిఖించదలచి నంబూర్ వరదాచార్యులు మిక్కిలి ప్రావీణ్యుడని గ్రహించి వారికి ఆ బాధ్యతను అప్పగించిరి. వారు పని పూర్తి చేసిన పిమ్మట నంజీయర్లు వారిని ప్రశసిస్తూ ‘నంపిళ్ళై’ అను నామమును బిరుదుగా ఇచ్చి వారిని మన దర్శన ప్రవర్తకుడిగా చేసెను. నంజీయర్ల కన్నా మంచి వ్యాఖ్యానమును చెప్పినప్పుడు నంపిళ్ళైను నంజీయర్లు ప్రశంసలతో ముంచేసేవారు. అటువంటి గొప్ప మహనీయుడు నంజీయర్లు.

నంజీయర్లకు సాంప్రదాయ విషయముల యందు గొప్ప అవగాహన ఉండేది. ఒక శ్రీవైష్ణవుడు మరొక శ్రీవైష్ణవుడి బాధను చూసి తమ బాధగా భావిస్తాడో, అతడు నిజమైన శ్రీవైష్ణవుడన్న శ్రీసూక్తమును మనకు అందించిరి. వారు వారి కాలములో ఉన్న శ్రీవైష్ణవుల యందు, ఇతర ఆచార్యుల యందు గొప్ప గౌరవము కలిగి యుండెడివారు.

వారు తిరుమంగై ఆళ్వార్ల పెరియ తిరుమొళి 3.6 (తూవిరియ మలరుళక్కి పదిగము) పాశురములను ‘పెఱ్ఱి’ అనే ఒక అరయరు స్వామి పారణ చేయుచున్నప్పుడు వారు ఆ అమృత ధారలో నిమఘ్నునులయ్యేవారు.

తమ చరమ దశలో, పెరుమాళ్ళను ‘స్వయం తిరుమేని’ దర్శనము కోరగా, పెరుమాళ్ళు అతని కొరకు మాత్రమే దర్శనమును ఇచ్చెను. ఆ దివ్య మంగళ విగ్రహమును చూసిన పిమ్మట, తమ శిష్యులకు అనేక చరమ సూచనలను ఇచ్చి, తమ చరమ తిరుమేనిని వదలి పరమపదమునకు చేరుకొనెను.

మనలో కూడా వారిలా ఆచార్య నిష్ఠ, భగవత్ భక్తి భావన కలుగచేయమని వారిని ప్రార్ధిద్ధాము.

నంజీయర్ల తనియన్

నమో వేదాంత వేద్యాయ జగన్ మంగళ హేతవే ।
యస్య వాగామృతాసార భూరితం భువన త్రయం ॥

సీతా రామాంజనేయ దినేష్ రామానుజ దాసు

మూలము: https://acharyas.koyil.org/index.php/2012/09/11/parasara-bhattar-english/

పొందుపరిచిన స్థానము – https://acharyas.koyil.org/index.php/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org/index.php
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

22 thoughts on “నంజీయర్”

Comments are closed.