కిడాంబి ఆచ్చాన్

శ్రీ:

శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమధ్వరవరమునయే నమ:
శ్రీ వానాచల మహామునయే నమ:

kidambi achan

తిరునక్షత్రం : చిత్రై (మేష మాసము), హస్తా నక్షత్రము

అవతార స్తలం : కాంచీపురం

ఆచార్యులు : ఎంపెరుమానార్

కిడాంబి ఆచ్చాన్ అసలు పేరు “ప్రణతార్తిహరులు”.  తిరుక్కచ్చి నంబి పాడిన దేవరాజ అష్టకములో “దేవ పెరుమాళ్”ను స్తుతించిన నామములలో ఈ పేరు కూడా ఒకటి.

6000 పడి గురు పరంపరా ప్రభావము, మరి కొన్ని పూర్వాచార్య గ్రంథముల ఆధారముగా తిరుక్కోష్టియూర్ నంబి వీరిని ఎంపెరుమానార్లకు తళిగ కైంకర్యమునకు ప్రధాన అధికారిగా నియమించినట్లుగా తెలియుచున్నది.

kidambi achan-emperumanar
ఎంపెరుమానార్లు గధ్యత్రయం మరియు నిత్య గ్రంథమును (తిరువారాధన క్రమము) లను అనుగ్రహించెను. అవి శ్రీవైష్ణవ సంప్రధాయమును తెలియ జేసే గొప్పగ్రంధములు. ఆకాలములో శ్రీరంగములోని కొందరికి ఎంపెరుమానార్ల విధానము నచ్చలేదు. అందువలన వారు అతి నీచమైన పనికి ఒడిగట్టారు. నిత్యము ఎంపెరుమానార్లు భిక్షకొరకు వెళ్ళు గృహములలో ఒక గృహిణి చేత విషము కలిపిన ఆహారమును బిక్షగా పెట్టించాలని పన్నాగము చేసి అలాగే పెట్టించారు. ఆమె భర్త కూడా ఈ నీచమైన పనిలో భాగస్వామి అయినప్పటికీ ఆమెకు ఈ పని చేయటము ఇష్టము లేదు, కాని భర్తకు ఎదురు చేప్పి గెలవలేక కన్నీటి పర్యంతమై ఎంపెరుమానార్ల భిక్షలో కలవకుండా విడిగా ఆహారమును పెట్టి సాష్టాంగ నమస్కారము ఆచరించింది. ఆమె అలా చేయటము ఎంపెరుమానార్లకు ఒక సంకేతముగ తోచి ఆ ఆహారమును కావేరిలో కలిపి వేసి పాప పరిహారార్థము ఉపవాస వ్రతమును ఆచరించారు.  తిరుక్కోష్టియూర్ నంబి ఈ వార్త విని పరుగు పరుగున శ్రీరంగము చేరుకున్నారు. అది మిట్ట మధ్యాహ్నవేళ. ఎండ ప్రచండముగా వుంది. ఎంపెరుమానార్లు సశిష్యులుగా తమ ఆచార్యులను ఆహ్వానించుటకు కావేరీ తీరమునకు ఎదురేగుతున్నారు. ఆచార్యులు దగ్గరకు చేరగానే ఆమిట్ట మధ్యహ్నవేళ ఇసుకనేలమీద ఎంపెరుమానార్లు సాష్టాంగ నమస్కారము ఆచరించించారు. నంబి ఎంతకు వీరిని లేవమని చేప్పలేదు (శ్రీ వైష్ణవ సంప్రదాయములో సాష్టాంగ నమస్కారము ఆచరించించినపుడు గ్రహీతలు లెమ్మని చెప్పేదాకా లేవకూడదు). అంతలో కిదాంబి ఆచ్చాన్ తాను ఇసుక మీద పడుకొని ఎంపెరుమానారును అమాంతము ఎత్తి తన మీద వేసుకొని, నంబిని చూచి “కోమలమైన కుసుమమును ఎండలో వేస్తారా? మండే ఇసుక మీద మా ఆచార్యులను ఎంతసేపు ఉంచుతారు?” అని కోపముగా అడిగారు. వీరికి ఎంపెరుమానార్ల మీద వున్న భక్తికి మెచ్చి నంబి” ఆచార్య దేహమును పరిరక్షించుకోవాలునుకునే మీరే ఇక నుండి ఎంపెరుమానార్లకు భిక్ష తయారు చేసి పెట్టండి” అని ఆదేశించారు. ఆరోజు మొదలు కిడాంబి ఆచ్చాన్ నిత్యము ఆ కైంకర్యమును ఆచరిస్తూ వచ్చారు.

కిదాంబి ఆచాన్ ఔన్నత్యమును తెలిపే కొన్ని వ్యాఖ్యానములను చూద్దాము.

  • తిరుప్పావై 23 – పెరియ వాచ్చాన్  పిళ్ళై వ్యాఖ్యానము – ఈ పాసురములో, ఆండాళ్ గోపికలకు కృష్ణుడు తప్ప వేరెవరు రక్షకులు లేరని తెలుపుతుంది. ఆ గోపికలలాగానే కిడాంబి ఆచాన్ కూడా తిరుమాలిరుంచోలై పెరుమాళ్ళైన అళగర్ను సేవించు కోవటానికి వెళ్ళినప్పుడు ఆ స్వామి ఏదైనా పాడమని అడిగారు. వెంటనే ఆచ్చాన్ ఆళవంధార్ల  స్తోత్ర రత్నము – 48వ శ్లోకము“అపరాద సహస్ర భాజనం…అగతిం ..” అని పాడారు. దానికి పెరుమాళ్ళు స్పందించి “మీరు ఎంపెరుమానార్ లను ఆశ్రయించి వుండగా గతి లేనివారెలా అవుతారన్నారు.
  • తిరువిరుత్తం 99 – పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానము – ఒక సారి కూరాత్తాళ్వాన్ కాలక్షేపమునకు వెళ్ళిన ఆచ్చాన్ ఆలస్యముగా మఠమునకు వచ్చారు. ఎంపెరుమానార్ ఆలస్యమునకు కారణమడిగారు. కిదాంబి ఆచ్చాన్ కాలక్షేపమునకు వెళ్ళటము వలన ఆలస్యమైనదని చెప్పారు. ఎంపెరుమానార్ ఏ పాసురము చెపుతున్నారని అడిగగా” పిఱందవారుం వళందవారున్” (తిరువాయ్మొళి 5.10) పధ్గమని చెప్పారు.  ఆళ్వాన్ ఎలా వ్యాఖ్యానము చేసారని ఎంపెరుమానార్ అడగగా, కూరాత్తాళ్వాన్ పాసురమును పాడి అర్థములు చెపుతూ కన్నీరు మున్నీరై నమ్మాళ్వార్ల అనుభవం ఉన్నతమైనది. దానిని ఎలా వర్ణిచగలము నాకు మాటలే దొరకటము లేదని దు:ఖించారని వివరించారు. ఇది విన్న ఎంపెరుమానార్ నమ్మాళ్వార్ల మీద ఆళ్వాన్ కున్న భక్తికి పొంగిపోయారు.
  • తిరువాయ్మొళి 4.8.2 – నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానము – ఒక సారి కిదాంబి ఆచ్చాన్ తదీయారాధన సమయ ములో అందరికీ మంచి నీళ్ళు అందిస్తున్నారు (ఆ రోజులలో నోటిలోనే మంచి నీరు పోసేవారు). గోష్టిలోని ఒక శ్రీవైష్ణవులు మంచి నీరు అడగగా ఆచ్చాన్ పక్క నుండి మంచి నీరు పోసారు. అది చూసిన ఎంపెరుమానార్ పరుగున దగ్గరకు వచ్చి, ‘అలా పక్కనుండి పోస్తే తాగేవారికి కష్టముగా వుంటుంది ఎదురుగా నిలబడి పోస్తే నీటిధార సమానముగా వస్తుంది తాగేవారికి సుళువుగా వుంటుంది” అని చెప్పగా ఆచ్చాన్ “పణిమానం పిళయామే అడియేనైప్ పణి కొణ్డ” (దాసుడిని సక్రమముగా  తీర్చి దిద్దుతున్నారు) అన్న నమ్మళ్వార్ల మాటను ఎంపెరుమానార్ పాటిస్తున్నారు కదా అని పొంగిపోయారు.
  • తిరువాయ్మొళి 6.7.5 – నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానమునమ్మాళ్వార్ కన్నులంటూ వున్నది దివ్య దేశములను  సేవించు కోవటానికేనని వాటి ప్రాశస్త్యములను ఈ పాసురములో వివరించారు. ఈ సందర్భముగా అచ్చాన్ జీవితములో జరిగిన ఒక సంఘటనను చూద్దాము. ముదలియాండాన్, కిదాంబి ఆచ్చాన్ కలిసి తిరుక్కుడంతై బయలుదేరారు. దారిలో అప్పక్కుడతాన్ కోవెల కనపడగానే ఈ పాసురము స్మరణకు వచ్చి ఆ స్వామిని కూడా సేవించుకొని బయలుదేరారు.
  • తిరువాయ్మొళి 10.6.1 – కిదాంబి ఆచ్చాన్ భట్టరు పట్ల చాలా నమ్రత చూపేవారు. ఒక సారి భట్టరు శిష్యులలో ఒకరైన ఇళయాళ్వాన్ వీరిని అలా నడచుకోవటానికి కారణమడగగా, వీరు ఎంపెరుమానార్ ఆఙ్ఞ గురించి వివరించారు. ఒక రోజు భట్టరు పెరియ పెరుమాళును సేవించుకోవాలని కోవెలకు వేంచేయగా ఎంపెరుమానార్ ఎదురు వెళ్ళి ఆహ్వానించి గర్భ గుడిలోనికి తీసుకు వెళ్ళి, స్వామిపై ఒక శ్లోకము పాడమని కోరి, తరువాత వారిని భయటకు తీసుకు వచ్చి, తన శిష్యులతో” భట్టరు మా పట్ల ఎలా నడచుకొంటారో మీరందరూ వారి పట్ల అలా నడచుకోవాలని ఆఙ్ఞాపించారని చెప్పారు.

కిడాంబి నాయనార్ (కిడాంబి ఆచ్చాన్ వారసులు )తిరువె:క్కాలో మణవాళ మామునులకు శ్రీ భాష్యమును చెప్పారు. ఆ సమయములో కిడాంబి నాయనార్ కోరగా మామునులు తమ నిజ స్వరూపమును చూపించారు. ఆ తరవాత వారికి మామునుల మీద అభిమానము ఇంకా పెరిగింది.

కిడాంబి ఆచ్చాన్ భాగవత నిష్టను గురించి, వీరి మీద ఎంపెరుమానార్ ఉన్న అభిమానమును గురించి తెలుసుకున్న మనము కూడ వారి శ్రీపాదములకు నమస్కరించి ఆచార్య, భాగవత నిష్టను కలిగి వుందేలాగా అనుగ్రహించమని ప్రార్థన చేద్దాము.

కిడాంబి ఆచ్చాన్ తనియన్:

రామానుజ పదాంభోజయుగళీ యస్య ధీమతః
ప్రాప్యం చ ప్రాపకం వంధే ప్రన్ణతార్థిహరం గురుం

అడియెన్ చూడామణి రామానుజ దాసి

మూలము: https://acharyas.koyil.org/index.php/2013/04/03/koil-komandur-ilayavilli-achan-english/

పొందుపరిచిన స్థానము – https://acharyas.koyil.org/index.php/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org/index.php
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org